Update 04

చీకటి రాజ్యాల విస్తరణ

హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా నాయకులతో ఘోర కలి మీటింగ్


హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఎంతో మంది అమాయకులను ఎన్నో దేశాలకు తరలిస్తూ ఉంటారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా దొరికిన వారిని ఎన్నో ఇల్లీగల్ పనులకు వాడుకుంటారు. వాళ్ళను బానిసలుగా చేసి సప్లై చేస్తూ ఉంటారు కొంత మంది. బానిసత్వం ఇప్పటికీ చాలా దేశాలలో ఉంది. అందుకే ఇలాంటి వాళ్లకు డిమాండ్ బాగా ఉంటుంది మార్కెట్లో. సరిగ్గా ఇలాంటి వాళ్ళ మీదే ఘోర కలి నిఘా పెట్టాడు.

ప్రపంచం మొత్తంలో ఇలాంటి గ్యాంగ్స్ ఒక 183 ఉన్నట్టు గుర్తించాడు. ఆ 183 గ్యాంగ్స్ ని నడిపే కింగ్ పిన్ లని పిలిపించాడు. వాళ్ళతో ఇలా చెప్పటం మొదలు పెట్టాడు.

"మీరు ఇప్పటిదాకా ఎంత మంది బానిసలను సప్లై చేశారో నాకు తెలియదు. ఇక నుంచి అవన్నీ ఆపెయ్యాలి. మీరందరూ నాకోసమే పని చెయ్యాలి. ప్రస్తుతం మీ దగ్గరున్న బానిసలను మా సైన్యానికి అప్పగించాలి"

వాళ్లలో ఒకడు,"ఎవడ్రా నువ్వు? మాకు ఆర్డర్ లు ఇస్తున్నావ్?....మొన్న యూట్యూబ్ లో చూసాను నీ వీడియో....బాగా నవ్వుకున్నాం నేను, నా ఫ్రెండ్స్....యూట్యూబ్, టిక్ టాక్ లో పాపులర్ అవ్వటానికి చేసుకో ఇలాంటివి...మా జోలికి రావొద్దు", అంటూ నవ్వుతూ ఉన్నాడు.

ఘోర కలి ఇదంతా సైలెంట్ గా గమనిస్తూ ఉన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. మొహం సీరియస్ గా అయిపోయింది. బలంగా అడుగులో అడుగు వేస్తూ తన పర్సనల్ ఛాంబర్ లోకి వెళ్ళిపోయాడు ఘోర కలి. వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక ఖడ్గంతో బయటికొచ్చాడు. తన రివాల్వింగ్ చైర్ లో కూర్చుని ఆ ఖడ్గాన్నే చూస్తూ ఇలా చెప్పాడు.

"నెపోలియన్ బోనాపార్టే స్వోర్డ్ గురించి మీకు ఐడియా ఉందా? 1800 లో బాటిల్ అఫ్ మరెంగో లో ఈ ఖడ్గాన్ని ఆస్ట్రియన్ సైన్యంతో పోరాడటానికి ఉపయోగించాడు. ఇటలీని గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అరేబియన్ లు వాడే కత్తులు పదునుగా శత్రువును చీల్చి చెండాడే మృత్యు పాశాలలా ఉండేవి. నెపోలియన్ కి అవి బాగా నచ్చి వాటిలానే ఉండే ఒక ఖడ్గాన్ని తయారు చేయించాడు. ఆ ఖడ్గం తయారీ వెనక ఇంత కథుంది.

దాన్ని రీసెంట్ గా ఆక్షన్ లో అమ్మేశారంట. ఇది తెలిసాక చాలా బాధేసింది. నా గర్ల్ ఫ్రెండ్ నాకు బ్రేక్ అప్ చెప్పినట్టు అనిపించింది. నా చేతిలో ఉండాల్సిన కత్తి ఇంకొకడి చేతిలోకెళ్లటం చూసి తట్టుకోలేకపోయా. నరికేద్దాం అనిపించింది. నెపోలియన్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. అందుకే ఆ కత్తి మీద చాలా రోజుల వరకు బెంగ పోలేదు. అది బెంగ కూడా కాదు. విరహ వేదన. నేను ఊరుకుంటానా?

అంతకంటే పదునైన కత్తిని తయారు చేయించా",

అని ఆ ఖడ్గాన్ని తీసి తనకు ఎదురుగా ఉన్న అతన్ని పొడిచేసాడు. అతను మరెవరో కాదు. ఇంతక్రితం ఘోర కలిని చూసి వెటకారంగా నవ్వుతూ హేళన చేసినతనే.

ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ హడలిపోయారు. వాళ్ళల్లో నుండి ఒకడు ముందుకొచ్చి," మీకేం కావాలో చెప్పండి. అది ఇచ్చేస్తాం. దయచేసి మమ్మల్ని ఏమీ చెయ్యొద్దు"

ఘోర కలి గట్టిగా నవ్వాడు.

"నాకేం కావాలో ఇందాకే మర్యాదగా అడిగాను కదరా బుజ్జి. విన్నారా ? నవ్వారు. నన్ను చూసి నవ్వారు. ఘోర కలిని చూసి ఎవడైనా నవ్వుతాడా !

ఎవ్వడైనా నవ్వుతాడా?" అని గట్టిగా అరిచాడు.

"నవ్వడు....మేము ఇంకెప్పుడూ నవ్వము", అని అందరూ ముక్తకంఠంతో జవాబిచ్చారు భయపడుతూనే.

దేన్నైతే పెట్టుబడిగా పెడితే జీవితకాలం లాభాలు పొందవచ్చో అలాంటిదే ఆ రోజు పెట్టుబడిగా పెట్టాడు ఘోర కలి.

అదే భయం.

భయం ఉన్నన్ని రోజులే ఆధిపత్యం తనతో ఉంటుందని బాగా తెలిసినవాడు ఘోర కలి.

ఆ భయాన్ని అక్కడున్న వాళ్ళందరి కళ్ళల్లో చూసి క్రూరత్వముతో మనః పూర్వకంగా నవ్వాడు.

రాబోయే రోజుల్లో ప్రపంచం తన వశం అవ్వబోతున్నదని లోలోపల ఆనందపడ్డాడు.

-------------------------------------------------

అశుతోష్ రెస్క్యూ ఆపరేషన్

ఘోర కలిని ఎదుర్కోవటానికి జోసెఫ్ సెబాస్టియన్ చేసే మేధోరచన


ఘోర కలి సామ్రాజ్యంలో బందీగా వున్న అశుతోష్ ని ఇలాంటి పరిస్థితులలో కాపాడటం ప్రాణాంతకమే. అయినా సరే జోసెఫ్ సెబాస్టియన్ కున్న పట్టుదలే తనను నిద్రపోనివ్వటం లేదు. ఒక వారం రోజుల నుండి ఆలోచిస్తూనే ఉన్నాడు. షేప్ షిఫ్టర్ అనేది మొదటి ఛాలెంజ్ అయితే అనుమానమొస్తే చాలు ముందు వెనక చూడకుండా చంపేస్తాడు అన్నది అసలైన ఛాలెంజ్. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. మొదటిగా ఘోర కలిని ఎలా అయినా సరే తను నమ్మించగలగాలి. ఘోర కలి అంత త్వరగా ఎవ్వరినీ నమ్మడు. ఎన్నో శల్యపరీక్షలు చేస్తాడు. ఏ ఒక్క దశలో విఫలమైనా సరే ప్రాణం పోతుంది.

ఘోర కలి అశుతోష్ చేసే ఇన్వెస్టిగేషన్ కి భయపడే అశుతోష్ ని బంధించి తన చీకటి రాజ్యంలో ఉంచాడనిపిస్తోంది. ఎంతో శక్తి గల ఘోర కలి అశుతోష్ ఇన్వెస్టిగేషన్ కి ఎందుకు భయపడుతున్నాడు? అంటే ఇందులోనే ఏదో క్లూ దాగుంది.

'అదృశ్య మందిరం' లో తప్పిపోయిన ఐదుగురికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ జోసెఫ్ సెబాస్టియన్ లాప్టాప్ లో వున్నాయి. ఈ కేసు ఇప్పుడు ప్రపంచం మొత్తానికి బహిర్గతం అవ్వటంతో తప్పిపోయిన ఆ ఐదుగురి ఫ్యామిలీస్ వుండే ఇళ్ళకి యాక్సెస్ దొరికింది మీడియా వాళ్లకు. ఎన్నో ప్రముఖమైన మీడియా సంస్థలు కోరటంతో కేంద్ర ప్రభుత్వమే దగ్గరుండి గ్రాంట్ చేసింది. కానీ ఒక షరతు విధించింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో జర్నలిజం చేసిన వాళ్ళని మాత్రమే అనుమతించేలా కండీషన్ పెట్టింది. ఆ ఐదు మంది కుటుంబాలకీ రక్షణ అవసరం కాబట్టి ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోక తప్పలేదు. జోసెఫ్ సెబాస్టియన్ సంజయ్ తో కలిసి రెండేళ్ల క్రితమే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి చాలా విషయాలు తెలుసుకున్నాడు.

కాబట్టి ఈ ఐదుగురు ఫ్యామిలీస్ ని ఇప్పుడు కలవటం పెద్ద కష్టమేమీ కాలేదు. పైగా సిబిఐ నుండి స్పెషల్ పర్మిషన్ ఇస్తూ ఒక లెటర్ కూడా రావటంతో జోసెఫ్ పని సులువైపోయింది. సంజయ్ సిబిఐ కి మెయిల్ పెట్టడంతో ఈ లెటర్ క్షణాల మీద ఫ్యాక్స్ లో జోసెఫ్ కు చేరింది.

ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మొదటగా రాధాకృష్ణన్ ఇంటిని ఎంచుకున్నాడు జోసెఫ్. చెన్నై లోని తాంబరమ్ లో వున్న రాధాకృష్ణన్ సొంత ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు ఇంట్లో రాధాకృష్ణన్ కూతురు ప్రియా కృష్ణన్ ఉంది.

బయట షూస్ వదిలేసి పక్కనే ఉన్న టాప్ దగ్గర కాళ్ళు కడుక్కుంటున్నాడు జోసెఫ్. టాప్ తిప్పుతున్నప్పుడు వచ్చే నీళ్ల శబ్దంతోటే ఎవరో వచ్చినట్టుగా గుర్తించి ప్రియా డోర్ వైపుగా నడుచుకుంటూ వస్తోంది. జోసెఫ్ కాలింగ్ బెల్ కొట్టడం ప్రియా కృష్ణన్ తలుపు తెరవటం రెండూ ఒకే సారి జరిగాయి. ఒక్క నిమిషం షాక్ అయ్యాడు జోసెఫ్. ఇలా బెల్ కొట్టగానే అలా తలుపు తెరుచుకోవటం ఏంటబ్బా అని.

జోసెఫ్: మీ రియాక్షన్ టైం ఏంటండీ ....అంత ఫాస్ట్ గా ఉంది !

ప్రియా: మీరు టాప్ ఆన్ చేసినప్పుడే ఎవరో వచ్చారని అనిపించింది....సో, వెంటనే వచ్చేసా

జోసెఫ్: మై నేమ్ ఈజ్....

ప్రియా: యా....ఐ నో యు....సంజయ్ నాకు మీ గురించి మెయిల్ పెట్టాడు…. తను మెయిల్ పెట్టకపోయినా మీరెవరో తెలుసు....ఇండియన్ ఎక్స్ప్రెస్ లో మీ ఒపీనియన్స్ చదువుతా.....

జోసెఫ్: గ్రేట్ !

ప్రియా: చెన్నై లో ఎండలు ఎక్కువ....ఏదైనా డ్రింక్ తీసుకుంటారా?

జోసెఫ్: గ్లాస్ అఫ్ వాటర్ ప్లీజ్ !

జోసెఫ్ కళ్ళ ముందే ప్రియా వాటర్ ప్యూరీఫైర్ లోంచి ఒక గ్లాస్ వాటర్ తెచ్చిచ్చింది.

జోసెఫ్: మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి....

ప్రియా: యా షూర్.....టేక్ ఏ సీట్ అండ్ హావ్ యువర్ వాటర్ ఫస్ట్

గ్లాస్ లోని నీళ్లు మొత్తం తాగేశాడు జోసెఫ్. తనతో తెచ్చుకున్న కేసు డైరీ బయటికి తీసాడు. అందులో రాధాకృష్ణన్ అన్న లీఫ్ ఉన్న చాప్టర్ ఓపెన్ చేసాడు.

జోసెఫ్: ఈ అదృశ్య మందిరంలోకి ఎంటర్ అవ్వటానికి మీ ఫాదర్ ఎన్నేళ్లు వర్క్ చేసాడు?

ప్రియా: 2 ఇయర్స్ ముందు తప్పిపోయాడు....సో అంతకు ముందు 5 ఇయర్స్ ఇదే ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేవాడు.

జోసెఫ్: ఫ్యామిలీకి అస్సలు టైం కేటాయించేవాడు కాదా?

ప్రియా: హహహ....చిన్నప్పటి నుంచి అలవాటే మాకు

జోసెఫ్: ఓకే....ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నందుకు శాలరీ వచ్చేదా?

ప్రియా: అఫ్ కోర్స్....ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేసే బ్రెయిన్స్ ఇద్దరే ఇద్దరు. ఒకరు మా ఫాదర్ ఇంకొకరు సైంటిస్ట్ కృష్ణ స్వామి....కృష్ణ స్వామి గారి కింద కొన్ని టీమ్స్ వర్క్ చేసేవి....వాళ్ళ డీటెయిల్స్ నాకే కాదు ఎవ్వరికీ తెలియవు ఇప్పటిదాకా.....

జోసెఫ్ చిన్నగా నవ్వాడు.

ప్రియా: ఎందుకు నవ్వుతున్నారు?

జోసెఫ్: కృష్ణ స్వామి కింద మూడు టీమ్స్ పని చేస్తాయి. ఒకటి ఐటి వింగ్. రెండు యాంటీ గ్రావిటీ టీం. మూడోది గ్రీవెన్స్ రిడ్రెస్సెల్ టీం. ఏ ఒక్క టీం కీ ఇంకొక టీం గురించి ఐడియా లేదు. ఒక్క యాంటీ గ్రావిటీ టీం కే కృష్ణ స్వామి గురించి కాస్త ఐడియా ఉంది. మిగతా రెండు టీమ్స్ కి కృష్ణ స్వామి ఎవరో కూడా తెలీదు. వాళ్ళు ఎవరికోసం వర్క్ చేస్తున్నారో కూడా తెలీదు. ఇచ్చిన టాస్క్ అండ్ అసైన్మెంట్ కంప్లీట్ చేసి డెలివరీ ఇవ్వటమే తెలుసు.

ప్రియా: ఇదంతా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కదా?

జోసెఫ్: యా...సిబిఐ కి ఈ కేసు హ్యాండోవర్ అయ్యేముందే సంజయ్ అండ్ నేనూ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది

ప్రియా: మరి నాకు చెప్తే మీకు ప్రాబ్లం అవ్వదా?

జోసెఫ్: ఆల్రెడీ వెబ్ లో....రెడిట్ లో కృష్ణ స్వామి కింద పని చేసే టీమ్స్ పైన చాలా థియరీలు ఉన్నాయి.....

----------------------------------------------------------------------

ప్రియా: ఓకే...అలాంటప్పుడు మా డాడీ గురించి మీకు తెలియకుండా ఎలా ఉంటుంది?

జోసెఫ్: మీ ఫాదర్ ఎప్పటికప్పుడు తన లొకేషన్ మారుస్తూ వచ్చారు. అసలు మీ సొంతిల్లు తాంబరమ్ లో వుంది అన్న విషయం ఈ మధ్యనే అశుతోష్ వల్ల తెలిసింది. తను ముంబైలో ప్రొఫెసర్ గా పని చేసే కాలేజీలో కూడా మీ సొంత ఇంటి అడ్రస్ ఇవ్వలేదు.

ప్రియా: మరి ఇప్పుడెలా కనిపెట్టారు?

జోసెఫ్: ఆండ్రూ గంబూర్ట్సేవ్ అనే జియాలజిస్ట్ తో మీ నాన్నగారు గుర్గావ్ లో మాట్లాడారు. ఆ మీటింగ్ చివర్లో ఆండ్రూతో మీ నాన్నగారు అడ్రస్ షేర్ చేసుకున్నారు. సిబిఐ ఇంటరాగేషన్ అయిపోయాక ఆండ్రూ అశుతోష్ తో ఈ అడ్రస్ ని షేర్ చేసుకున్నాడు. అలా తెలిసింది మీ ఇల్లు.

ప్రియా: గ్రేట్ వర్క్ ! కానీ ఇక్కడ మీకు తెలియని విషయం ఒకటుంది. మా నాన్నగారు పని చేసే కాలేజీలో సొంత ఇంటి అడ్రస్ ఇచ్చారు. నాకు బాగా గుర్తు. ఆయన సెలవులకి ఇంటికొచ్చినప్పుడు యూనివర్సిటీ నుండి కొన్ని పేపర్స్ వచ్చేవి.

జోసెఫ్: అవునా !

ప్రియా: యా....రీసెంట్ గా అడ్రస్ బుక్ లో ఏమైనా మార్చేసారేమో మరి

జోసెఫ్: అలా అయితే....ఆయన లాస్ట్ టైం ఎప్పుడు అడ్రస్ మార్చారో తెలుసుకోవాలి

ఆ డేట్ అండ్ టైం

మాటల మధ్యలోనే జోసెఫ్ లేచి నడుచుకుంటూ వెళ్లి ఇంట్లోని ప్రతీ గదిని ఒకసారి పరిశీలించాడు. ఒకే ఒక్క రూమ్ మాత్రం లాక్ చేసి వుంది.

జోసెఫ్: మీ నాన్నగారి స్టడీ రూమ్ చూడొచ్చా?

ప్రియా: యా...షూర్. తను మిస్సింగ్ అని తెలిసినప్పటి నుండి నేను తన రూమ్ ని లాక్ చేసుంచా. తన డెస్క్ మీదున్న ఒక్క కాగితం కూడా ముట్టుకోలేదు.

జోసెఫ్: సిబిఐ నుండి మీ ఇల్లు తనిఖీ చెయ్యటానికి నాకు ఇచ్చిన పర్మిషన్ లెటర్ కాపీ ఇది. యు కెన్ రీడ్ ఇట్.

ప్రియా : థాంక్ యు....ఇలా లీగల్ డాక్యుమెంట్ ఒకటుంటే మీకు ఆయన రూమ్ కి యాక్సెస్ ఇవ్వటానికి నాకే ప్రాబ్లం ఉండదు. నేనే అడుగుదాం అనుకున్నాను అంత లోపు మీరే ఇచ్చారు.

జోసెఫ్ అడిగినట్టుగానే ప్రియా రాధాకృష్ణన్ స్టడీ రూమ్ తలుపులు తెరిచింది. ఆ గది నిండా పుస్తకాలే ఉన్నాయి. ఎన్నో అరలు కల ఒక పెద్ద అల్మారా ఉంది. దాని నిండా పుస్తకాలు, పేపర్ లే. స్టడీ చైర్, టేబుల్ ఉన్నాయి. ఆ టేబుల్ కిందున్న అరకు లాక్ వేసి ఉంది. దాని కీ కోసం ప్రియాని అడిగాడు జోసెఫ్. అది ఓపెన్ చెయ్యగానే ఒక ఫైల్ కనబడింది. ప్రాజెక్ట్ టూర్ డే అదృశ్య మందిరం అని వుంది. ఇంతవరకు ఇలాంటిది చూడలేదు జోసెఫ్. ఆ ఫైల్ లో ఏ టు జెడ్ ప్లానింగ్ మొత్తం ఉంది. వెంటనే ఆ ఫైల్ ని తీసుకుని తన బ్యాగ్ లో పెట్టుకున్నాడు. ఫైల్ పెట్టిన చోటే ఒక అడ్రస్ బుక్ కూడా ఉంది. దాన్ని కూడా తీసుకున్నాడు.

ఇంకొన్ని రీసెర్చ్ పేపర్స్ ని కూడా తీసుకుని ప్రియాకు థాంక్స్ చెప్పి అక్కడి నుండి నిష్క్రమించాడు జోసెఫ్.

రిటర్న్ జర్నీ చెన్నై టు ముంబై ఫ్లైట్ బుక్ చేసాడు. ఫ్లైట్ లో తన వెనకే కూర్చున్న ప్యాసెంజర్ ఒకరు తనని గమనిస్తున్నట్టు అనిపించింది జోసెఫ్ కు.

రెండు గంటల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది.

ఎయిర్పోర్ట్ లోని బ్యాగేజ్ కౌంటర్ లో జోసెఫ్ తన బ్యాగ్ కలెక్ట్ చేసుకుని ఎగ్జిట్ వైపుగా వెళ్తున్నాడు.

ఫ్లైట్ లో తన వెనకే కూర్చున్న ప్యాసెంజర్ జోసెఫ్ ను వెంబడిస్తున్నాడు.

-------------------------------------------

శంభల రాజ్యానికి పయనం – 1

సిద్ధపురుషుని నేతృత్వంలో మార్గం సుగమం


ఈ ప్రపంచాన్ని ఘోర కలి నుండి కాపాడేందుకు కావాల్సిన శక్తులనీ, మనోధైర్యాన్నీ ప్రోది చేసుకోవటానికి శంభల రాజ్యానికి పయనం అవ్వటమే పరిష్కార మార్గంగా సూచించాడు సిద్ధపురుషుడు. రాజవరం గ్రామంలోని అధిష్ఠా నివాస స్థానమున విచ్చేసి ఉన్న సిద్ధపురుషుడు శంభల రాజ్యం గురించి అభిజిత్, అంకిత, సంజయ్ లతో ఇలా చెప్పటం మొదలు పెట్టాడు.

"బాహ్యమైన భౌతిక దృష్టికి శంభల రాజ్యం కనిపించదు.

కాలచక్ర తంత్రంలో ప్రవేశం ఉన్నవారికి మాత్రమే శంభల రాజ్య దర్శనం దొరుకుతుంది. భారతదేశానికి ఉత్తరాదిన ఉన్న సీతా నదిని దాటిన తర్వాత మాత్రమే శంభల రాజ్యం మనకు కనిపిస్తుంది. శంభల రాజ్యంలో ఏడుగురు ధర్మజ్ఞులు కాలచక్ర తంత్రాన్ని మనకు అందించారు. వాళ్ళు అందించిన ఆ తంత్ర శాస్త్రాన్నే శాక్యముని కల్కి రాజులకు ఇచ్చాడు. శంభల రాజ్యంలో మొత్తం 32 మంది రాజులు ఉన్నారు. మొదటి ఏడుగురినీ ధర్మజ్ఞులు అంటారు. మిగిలిన 25 మందినే

కల్కి రాజులు అంటారు. ప్రస్తుతం 21వ కల్కి రాజైన అనిరుద్ధుని కాలచక్రంలో నడుస్తోంది శంభల రాజ్యం."

"వాళ్ళని కల్కి రాజులు అని ఎందుకంటారు స్వామి?"అడిగాడు అభిజిత్.

"25వ చక్రవర్తి కల్కి ఆగమనంతో ఈ కాలచక్రం ముగిసిపోతుంది. అందుకే ఈ 25 మంది రాజులనూ కల్కి రాజులు అంటారు", అన్నాడు సిద్ధపురుషుడు.

"కల్కి రాకతో కాలచక్రం ఎలా అంతం అయిపోతుంది స్వామి?" అడిగాడు సంజయ్.

"కల్కి రాజుగా ఉన్న సమయంలోనే 'మహాప్రళయ సంగ్రామం

' జరుగుతుంది. ఆ సమయంలో ప్రపంచంలో ధర్మం పూర్తిగా నశించిపోవటం వలన దుష్టులైన వారే రాజ్యపరిపాలన చేస్తూ ఉంటారు. ధూమకేతువు లాంటి ఖడ్గంతో దేవదత్తం అని పిలువబడే తెల్లటి గుర్రాన్ని అధిరోహించి దుష్టశిక్షణ చేస్తూ కల్కి ధర్మాన్ని నిలబెడతాడు. కల్కి శ్రీమహావిష్ణువు అవతారం. ఆయన పరిసమాప్తించిన తర్వాత తిరిగి సత్యయుగం ఆరంభం అవుతుంది. అలా ఈ కాలచక్రం అంతం అయిపోతుంది ", అన్నాడు సిద్ధపురుషుడు.

"ధూమకేతువు అంటే ఏమిటి స్వామి?" అడిగింది అంకిత.

"తోకచుక్క. అలాంటి ఆకారంలో ఉంటూ భగభగ మండే అగ్నితో పదునైన ఖడ్గమును చేతబూని దుర్మదాంధులను సంహరిస్తాడని మన విష్ణుపురాణంలో చెప్పబడి ఉంది", అన్నాడా సిద్ధపురుషుడు.

"శాక్యముని అందించిన ఆ కాలచక్ర తంత్రాన్నే ఇప్పుడు మీకు దీక్షగా అందిస్తున్నాను. శ్రద్ధగా దీన్ని తీసుకుని శంభల రాజ్యంలో మీ పయనానికి మార్గాన్ని సుగమం చేసుకోండి", అన్నాడు సిద్ధపురుషుడు.

"స్వామి...ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి. శాక్యముని అనగా ఎవరు?" అడిగాడు అభిజిత్.

"గౌతమ బుద్ధుడినే శాక్యముని అంటారు. అగ్నిపురాణంలోని 16వ అధ్యాయంలో బుద్ధుడి గురించి, కల్కి గురించి చెప్పబడి ఉన్నది. పురాణాల్ని అధ్యయనం చెయ్యటం అన్నది మనకు ఎప్పటి నుంచో విధిగా వస్తున్నది. పురాణాల్ని మననం చేస్తూ ఉంటే వాటిలో ప్రస్తావించిన విషయాలను ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలము", అన్నాడు సిద్ధపురుషుడు.

"మీకు ఇంకా ఏవైనా సంశయాలు ఉన్నచో ఇప్పుడే అడగండి. ఆ కాలచక్ర తంత్రాన్ని దీక్షగా తీసుకున్న తర్వాత ఒక్క వాక్యం కూడా మీరు పలుకరాదు. అచంచలమైన శ్రద్ధ, పట్టుదలతో అభ్యసించినప్పుడు మాత్రమే మీకు ఆ తంత్రం సిద్ధిస్తుంది ", అన్నాడా సిద్ధపురుషుడు.

"ఇక్కడి నుండి శంభల రాజ్యానికి వెళ్లి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావటానికి ఎంత సమయం పడుతుంది స్వామి?" అన్నాడు సంజయ్.

"యుద్ధవిద్యల గురించి ప్రస్తావించిన అథర్వణ వేదంలోని ఎన్నో రహస్యాలను మీరు అక్కడ తెలుసుకోనున్నారు. వాటిని అధ్యయనం చేసి, సాధన చేసి చివరిగా ఒకసారి క్షుణ్ణముగా మొత్తం చదివితే కానీ అర్థమయ్యేవి కావవి. ఈ ప్రక్రియ అంతా పూర్తవ్వటానికి 30 దినముల వ్యవధి సరిపోతుంది", అని చెప్పాడు సిద్ధపురుషుడు.

సంజయ్ కాసేపు ఆలోచించాడు. అభిజిత్, అంకితలను రెండు ప్రశ్నలు అడిగాడు.

"30 రోజుల టైం పడితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ డిలే అయిపోతుందేమో కదా? పైగా మనకి సిబిఐ నుండి పర్మిషన్ ఎలా దొరుకుతుంది?"

"అశుతోష్ ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ ని ఆపేశాడో ఇప్పుడు జోసెఫ్ సెబాస్టియన్ అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నాడు. జోసెఫ్ కేసు ఇన్వెస్టిగేషన్ స్టేటస్ ని సిబిఐ కి అప్డేట్ చేస్తూనే ఉన్నాడు. మనకు రోజూ మెయిల్స్ పెడుతున్నాడు. మనం మొబైల్, లాప్టాప్ ఇలాంటివి శంభల రాజ్యంలోకి తీసుకుని వెళ్లలేం కాబట్టి ఆటోమేటిక్ రిప్లైస్ వచ్చేలా మెయిల్ లో అవుట్ అఫ్ ఆఫీస్ సెట్టింగ్స్ అప్లై చేసేద్దాం. ఇప్పుడున్న సిట్యుయేషన్ లో అశుతోష్ ని రెస్క్యూ చెయ్యటం మీదనే అందరి ఫోకస్ ఉంది. పైగా ఘోర కలి ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ తెలియదు. 'అదృశ్య మందిరం' కేసు ఇన్వెస్టిగేషన్ ని ఎవ్వరూ టచ్ చెయ్యకండి అని ఘోర కలి వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి మీడియాలో మన గురించి ఎవ్వరూ పట్టించుకోరు. 30 రోజులు కాబట్టి మనం ఎక్కడికి వెళ్లిపోయాం అని ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. వెళ్లే ముందే ఒక మెయిల్ పెట్టేస్తే సరిపోతుందని అనుకుంటున్నాను", అన్నాడు అభిజిత్.

అదేదో చాలా తేలికైన విషయం అన్నట్టు అభిజిత్ అంత నార్మల్ గా చెప్పేసరికి సంజయ్, అంకిత తననే రెప్పార్పకుండా చూస్తూ ఉన్నారు.

చివరికి చేసేదేం లేక అభిజిత్ చెప్పినట్టుగానే సంజయ్ మెయిల్ బాక్స్ ని వెకేషన్ రెస్పాన్స్ ఇచ్చేలా సెట్ చేసాడు. 30 రోజుల పాటు వీళ్ళు అవుట్ అఫ్ రాజవరం వెళ్తున్నారని...అది కూడా కేసు ఇన్వెస్టిగేషన్ కోసమే అని....అదొక సీక్రెట్ ఆపరేషన్ కావటంతో డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయలేనని సీబీఐకి మెయిల్ పెట్టేసాడు సంజయ్. ఇన్ని రోజులూ జోసెఫ్ సెబాస్టియన్ కు తను కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన ప్రతీ డీటెయిల్ ని అప్డేట్ చేశానని.... ఈ సీక్రెట్ ఆపరేషన్

వల్ల మెయిల్ లేదా కాల్ సపోర్ట్ ఇవ్వలేకపోయినా జోసెఫ్ కి కేసు ఇన్వెస్టిగేషన్ లో వచ్చే నష్టమేం లేదంటూ లాజికల్ పాయింట్ ఒకటి మెన్షన్ చేసి మెయిల్ ని కంక్లూడ్ చేసాడు సంజయ్.

-------------------------------------------------------------

సిద్ధపురుషుడి దగ్గరి నుండి ఆ కాలచక్ర తంత్ర ప్రవేశం

దొరకటానికి సంజయ్, అభిజిత్, అంకిత లకు 8 గంటల సమయం పట్టింది. అధిష్ఠాను, రాజవరం గ్రామ ప్రజల్ని శాపవిముక్తులను గావిస్తానని మాటిచ్చాడు సిద్ధపురుషుడు.

సంజయ్, అభిజిత్, అంకితలు అధిష్ఠాతో కాసేపు మాట్లాడారు.

సిద్ధపురుషుడి గురించి వాళ్లకి తెలియని కొన్ని నిజాలను అధిష్ఠా వారితో పంచుకున్నాడు. రాజవరం గ్రామానికి వీడ్కోలు పలుకుతూ శంభల రాజ్యానికి పయనమయ్యారు సంజయ్, అభిజిత్, అంకితలు సిద్ధపురుషుని సారథ్యములో.

భారతదేశానికి ఉత్తరాదిన ఉన్న సీతా నది వైపుగా సిద్ధపురుషుడు వారిని తీసుకెళ్లాడు.

కాలచక్ర తంత్ర ప్రవేశం గురించి మాత్రమే సిద్ధపురుషుడు వారికి చెప్పాడు. ఆ తర్వాత క్రమంలో వారికి ఎదురయ్యే పరీక్షల గురించి ఏ వివరమూ తెలుపలేదు.

అవి తెలియకుండా అమాయకంగా సిద్ధపురుషుడు చెప్పినట్టుగానే మౌనంగా ఆయన వెంటే ఉత్తరాది వైపుగా పయనమయ్యారు సంజయ్, అభిజిత్, అంకితలు. ఎన్నో కఠినమైన పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొన్న తర్వాత గాని శంభల రాజ్యంలోకి అడుగుపెట్టలేరన్న నిజాన్ని అతి త్వరలో తెలుసుకోబోతున్నారు.

-----------------------------------------------------------------------

శంభల రాజ్యానికి పయనం – 2

అద్భుతం....అమోఘం.....అజ'రామ'రం


ఉత్తరాదిన ఉన్న సీతానది వైపుగా సిద్ధపురుషుడు సంజయ్, అభిజిత్, అంకితలను తీసుకెళ్తున్నాడు. దక్షిణాదిన ఉన్న రాజవరం నుండి ఉత్తరాదిన ఉండే వారణాసికి ఫ్లైట్ లో 3 గంటల్లో చేరిపోయారు నలుగురూ. వారణాసి నుండి వీళ్ళు సీతానదిని వెతుకుతూ బయలుదేరి ఇప్పటికి 8 గంటలు గడుస్తోంది. అయినా ఆ సీతానది కనిపించలేదు. సంజయ్, అభిజిత్, అంకితలు అసహనానికి లోనవుతున్నారు. అయినా ఆ సిద్ధపురుషుడి మీదున్న నమ్మకంతో ఒక్క మాట కూడా బయటికి మాట్లాడటం లేదు. ఇంతలో ఒక చిన్న మందిరం ఒకటి కనిపించింది వాళ్లకి. చుట్టుపక్కల నివసించే ప్రజలు తండోప తండాలుగా తరలివచ్చారు ఆ గుడికి. సాయంత్రం 7 కావస్తోంది.

సిద్ధపురుషుడు వాళ్ళతో ఇలా అన్నాడు," సీతానదికి మనకు దారి దొరికేలా ఉన్నది. ముందు మనం ఆ గుడికి వెళ్లి ఆ దేవిని దర్శించుకుందాం. ఆ నారాయణుడే మనకు ఏదో ఒక మార్గాన్ని నిర్దేశిస్తాడు."

నలుగురూ ఆ గుడికి వెళ్లారు. చిత్రమేమిటంటే అది సీతాదేవి ఆలయం. అక్కడున్న గ్రామ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో సీతాదేవిని కొలుస్తున్నారు.

ఆలయ ప్రాంగణంలోకి వీళ్ళు అడుగుపెట్టగానే అక్కడున్న కొంత మంది గ్రామ ప్రజలు ఎదురొచ్చారు. వాళ్లలో ఒకడు,"మీరొస్తున్నారని మాకు ముందే తెలిసింది. ఆలయ పూజారి చెప్పారు. ఇక్కడున్న కొళాయిలో మీరు కాళ్ళు కడుక్కున్న తర్వాతే ఆలయంలోకి ప్రవేశించండి", అని చెప్పాడు.

"గంగతో పావనం అయిన తరవాతే ఆ సీతాదేవి దర్శనభాగ్యం అన్నమాట. బావుంది", అన్నాడు సిద్ధపురుషుడు.

నలుగురూ అక్కడే ఉన్న కొళాయిలో పాదాలను పరిశుద్ధి చేసి ఆలయంలోకి ప్రవేశించారు.

సీతాదేవి దర్శనం దివ్యంగా జరిగింది. అమ్మవారిలో ఉన్న దైవీభావాలు, పవిత్రత వల్ల దర్శనం చేసుకున్న వారెవరికైనా కొత్త శక్తులు ఉద్భవిస్తాయి. నిద్రాణంగా ఉన్న శక్తులు జాగృతం అవుతాయి.

దర్శనం అయిపోయాక కాసేపు అక్కడే ఆసీనులయ్యారు నలుగురూ.

ఇంతలో ఇద్దరు దివ్యపురుషులు ఆలయప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఒక దివ్యపురుషుడు నీలకాంతితో ఉన్నాడు. ఇంకొక దివ్యపురుషుడు బంగారు కాంతితో ఉన్నాడు. ఇద్దరి భుజాలకి ధనుస్సులున్నాయి. వెనుక అంబులపొదులున్నాయి.

వారిని చూడగానే అక్కడున్న వారందరూ పాదాభివందనం చేశారు. చూస్తూండగానే ఆ ఆలయంలో ఉన్న గ్రామ ప్రజలందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆలయంలో పూజారి, సిద్ధపురుషుడు, సంజయ్, అభిజిత్, అంకితలు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ దివ్యపురుషులిద్దరూ గర్భగుడిలో కెళ్ళి సీతాదేవి దర్శనం చేసుకున్నారు. పూజారి నోట మాట రాలేదు. వారిరువుర్నీ చూస్తూ నమస్కరించాడు. దివ్యపురుషులిద్దరూ చిరుమందహాసంతో పూజారికి నమస్కరించారు. ఆ పూజారి వెంటనే అక్కడినుండి 'జై శ్రీరామ్', 'జై శ్రీరామ్' అంటూ పరుగుపరుగున వెళ్ళిపోయాడు.

సంజయ్, అభిజిత్, అంకితలకు ఇదంతా ఒక కలలా ఉంది. సిద్ధపురుషుడికి ఇదంతా విష్ణుమాయ అని అర్థం అవుతోంది. సీతాదేవి దర్శనం అయిన తర్వాత ఆ దివ్యపురుషులిద్దరూ వీరి దగ్గరికే వచ్చి వారి చెంతనే ఆసీనులై కూర్చున్నారు.

"నమస్కరించటం అంటే నిష్కల్మషమైన మనస్సును దేవునియందు సమర్పించటమే కదా, లక్ష్మణా?" అన్నాడు రాముడు.

"మీకు తెలియనిదా అగ్రజా!" అన్నాడు లక్ష్మణుడు.

"ఈ రోజు వీరు నలుగురూ త్రికరణ శుద్ధితో సీతాదేవిని వేడుకున్నారు, లక్ష్మణా. అందుకే కదా మనిద్దరమూ ఇంత దూరం పయనమయ్యి వచ్చాము వీరి కోసం", అన్నాడు రాముడు.

ఆ మాట వినగానే అక్కడున్న సంజయ్, అభిజిత్, అంకితలు లేచి నిల్చున్నారు. సిద్ధపురుషుడు అప్పటికే నిలబడి ఉన్నాడు. నలుగురూ రామలక్ష్మణులకు సాష్టాంగ ప్రణామం చేశారు. శివుడు పార్వతీ దేవికి చెప్పిన

'శ్రీ రామ రామ రామేతి'

శ్లోకాన్ని పఠించారు.

"విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పినంత ఫలితాన్ని

'శ్రీ రామ రామ రామేతి'

చెప్పేసి పొందారు. తెలివైనవాళ్ళే", అంటూ ఆటపట్టించాడు లక్ష్మణుడు.

"రాముడు శుద్ధమైన అంతఃకరణను మాత్రమే చూస్తాడు కదా స్వామీ. తమకు తెలియనిది ఏముంది?" అన్నాడు సిద్ధపురుషుడు.

"అది సరే గాని", అంటూ సంజయ్, అభిజిత్, అంకితలను చూస్తూ, "వీళ్ళేం మాట్లాడరా?" అన్నాడు లక్ష్మణుడు చమత్కారంగా.

"శంభల రాజ్యానికి పయనం అయినప్పటి నుండి

మౌనదీక్ష

వహిస్తున్నారు స్వామి. ఇప్పటి వరకూ ఏమీ తినలేదు. పచ్చి మంచి నీరు కూడా ముట్టలేదు. మానసిక, శారీరక అలసటకు గురయ్యారు" అన్నాడు ఆ సిద్ధపురుషుడు.

ఆ మాట వినగానే రాముడు తన దగ్గరున్న గంగాతీర్థాన్ని సిద్ధపురుషుడికిస్తూ ఇలా అన్నాడు,"బిడ్డలు అడగకుండానే అమ్మకు వాళ్ళ ఆకలి అర్థం అయిపోతుంది. మీరు సీతాదేవిని ప్రార్థించగానే ఈ గంగాతీర్థాన్ని నాకిచ్చి పంపించింది. ఎంతైనా అమ్మ అమ్మే కదా", అన్నాడు రాముడు.

రాముడు అలా

'ఎంతైనా అమ్మ అమ్మే కదా'

అంటూ ఉండగానే వాళ్లకు ఆకలి తీరిపోయింది. సంజయ్, అభిజిత్, అంకితలకు ఆ గంగాతీర్థాన్ని సిద్ధపురుషుడు ఇచ్చాడు.

"వాళ్ళకిచ్చి నువ్వు తీసుకోవేమయ్యా?" అన్నాడు లక్ష్మణుడు.

"సమర్థ రాఘవునికి ఆ తీర్థాన్ని నేనే స్వయంగా ఇస్తాను లే. అసలే చాలా దూరం ప్రయాణించాలి కదా", అంటూ రాముడే ఆ పవిత్ర గంగను సిద్ధపురుషునికి తీర్థంగా ఇచ్చాడు.​
Next page: Update 05
Previous page: Update 03